యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు : పెట్రోల్ ఉత్పత్తుల రేట్ల పెంపునకు నిరసనగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైకిల్ తొక్కారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నర్సింహస్వామి పాదాల వద్ద నుంచి అయిలయ్య సైకిల్ తొక్కడం ప్రారంభించారు. అక్కడి నుంచి వంగపల్లి, రామాజీపేట, పెద్ద కందుకూరు మీదుగా ఆలేరుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ లీడర్లు స్వాగతం పలికారు.
ఆలేరు మార్కెట్ యార్డు, కొలనుపాకలోని వడ్ల కొనుగోలు సెంటర్లను సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడారు. కొనుగోలు ఆలస్యంగా జరుగుతోందని రైతులు తెలపడంతో కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆరా తీశారు. వెంటనే కొనుగోళ్లు స్పీడప్ చేయాలని, లారీలు పంపించి మిల్లులకు వడ్లను తరలించాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ రేట్ల పెంపు వలన సామాన్య ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయని, నిత్యవసర రేట్లు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రో ఉత్పత్తుల రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.
